న్యూస్18 కన్నడ కథనం ప్రకారం సాధారణంగా 120/80 mmHg రక్తపోటును ఆరోగ్యకరమైన స్థాయిగా పరిగణిస్తారు. ఇందులో సిస్టోలిక్ (పై సంఖ్య) 120 mmHg, డయాస్టోలిక్ (క్రింది సంఖ్య) 80 mmHg వరకు ఉంటే సాధారణంగా భావిస్తారు. ఈ స్థాయిని మించి రక్తపోటు పెరిగితే వైద్యుల సలహా తీసుకోవడం అవసరం.
హై బీపీ ఉన్నవారిలో కొన్నిసార్లు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. అయితే కొందరిలో తలనొప్పి, తలతిరగడం, అలసట, నీరసం, ఛాతి నొప్పి, గుండె దడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు కనిపించవచ్చు. ముఖ్యంగా ఉదయం నిద్రలేవగానే కొంతమందిలో రక్తపోటు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కేవలం మందులపైనే ఆధారపడకుండా సమతుల ఆహారం, ప్రతిరోజూ వ్యాయామం, ఒత్తిడి నియంత్రణ, సరిపడ నిద్ర వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు కూడా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
భారతీయ యోగా గురువు, రచయిత, పరిశోధకురాలు డాక్టర్ హంస యోగేంద్ర అభిప్రాయం ప్రకారం, ప్రతి ఉదయం కొద్దిసేపు నడవడం, అలాగే ఉసిరికాయ మరియు వాము కలిపిన నీటిని పరిమితంగా తీసుకోవడం రక్తపోటు నియంత్రణకు సహాయపడే అవకాశం ఉంది. అయితే ఇది వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని ఆమె స్పష్టం చేశారు.
ఆయుర్వేదం ప్రకారం ఉసిరికాయలో విటమిన్-సి, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. శరీరంలోని సోడియం స్థాయిలను సమతుల్యం చేయడంలో కూడా పొటాషియం ఉపయోగపడుతుంది. అలాగే యాంటీఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి తోడ్పడతాయి.
వాములో ఉండే థైమోల్ వంటి సహజ సమ్మేళనాలు జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీరంలోని అదనపు నీరు, సోడియంను బయటకు పంపడంలో సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీంతో రక్తపోటు నియంత్రణకు కొంత మేలు జరిగే అవకాశం ఉంటుంది. వాములోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో వాపును తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయి.
ఈ పానీయం తయారు చేయాలంటే 2 లేదా 3 ఉసిరికాయలు, ఒక టీ స్పూన్ వాము, ఒక గ్లాసు నీరు తీసుకోవాలి. ఉసిరికాయలను చిన్న ముక్కలుగా కోసి నీటితో కలిపి మెత్తగా గ్రైండ్ చేసి రసం తీసుకోవాలి. వామును స్వల్పంగా వేయించి పొడిచేసి ఆ రసంలో కలపాలి. రుచి కోసం కొద్దిగా నిమ్మరసం, ఒక టీ స్పూన్ తేనె కలుపుకోవచ్చు. దీనిని ఉదయం పరగడుపున పరిమితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.
అయితే హై బీపీకి మందులు వాడుతున్నవారు లేదా రక్తపోటు తరచుగా ఎక్కువగా ఉండేవారు ఈ ఇంటి చిట్కాలను ప్రారంభించే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. ఈ పానీయం ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా ఉపయోగపడవచ్చు గానీ, వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. సమతుల ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, వైద్యుల సూచించిన మందులు, ఆరోగ్య పరీక్షలు కొనసాగిస్తేనే రక్తపోటును సమర్థంగా నియంత్రించుకోవచ్చు.
