Last Updated:
MCX Gold Price: అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, సురక్షిత పెట్టుబడులపై పెరుగుతున్న ఆసక్తి దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం, వెండి ధరలకు మళ్లీ ఊపునిచ్చాయి. గురువారం ఎంసీఎక్స్ (MCX) ట్రేడింగ్ ప్రారంభం నుంచే బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరగడంతో కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల దృష్టి మరోసారి విలువైన లోహాలపై పడింది. ప్రస్తుతం బంగారం, వెండి ఎంతకు ట్రేడవుతున్నాయి? ఈ పెరుగుదలకు కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అంతర్జాతీయ మార్కెట్లలో మళ్లీ భౌగోళిక ఉద్రిక్తతలు పెరగడం, ఇరాన్-అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, హోర్ముజ్ జలసంధి చుట్టూ నెలకొన్న అనిశ్చితి, అలాగే సురక్షిత పెట్టుబడుల (Safe Haven) వైపు ఇన్వెస్టర్లు భారీగా మొగ్గు చూపడం వంటి కారణాలతో బంగారం, వెండి ధరలు మళ్లీ జోరందుకున్నాయి. ప్రపంచ మార్కెట్లలో రిస్క్ భావనలు పెరగడంతో ఈక్విటీ మార్కెట్ల నుంచి కొంత పెట్టుబడి బంగారం, వెండి వంటి విలువైన లోహాల వైపు మళ్లుతోంది. ఈ ప్రభావం దేశీయ కమోడిటీ మార్కెట్ అయిన మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. గురువారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే బంగారం, వెండి ఫ్యూచర్స్ ధరలు బలమైన లాభాలతో ట్రేడవుతున్నాయి.
మనీకంట్రోల్ వెల్లడించిన లైవ్ ఎంసీఎక్స్ (MCX) ధరల ప్రకారం, ఆగస్టు 5 ప్యూచర్ కాంట్రాక్ట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఒక్కసారిగా రూ.522 పెరిగి రూ.1,40,831కు చేరుకుంది. గత ట్రేడింగ్ సెషన్తో పోలిస్తే ఈ పెరుగుదల గణనీయంగా ఉండటంతో బులియన్ మార్కెట్లో కొనుగోలు ఆసక్తి పెరిగినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధరలు బలపడటం, డాలర్ ఇండెక్స్లో హెచ్చుతగ్గులు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై కొనసాగుతున్న అంచనాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రమవుతాయనే ఆందోళనలతో ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తూ కొనుగోళ్లను పెంచుతున్నారు.
అదే సమయంలో వెండి ధరలు కూడా భారీ లాభాలను నమోదు చేశాయి. సెప్టెంబర్ 4 ప్యూచర్ ఎంసీఎక్స్ కాంట్రాక్ట్లో కేజీ వెండి ధర రూ.848 పెరిగి రూ.2,18,566 వద్ద ట్రేడవుతోంది. వెండి ధరలకు పారిశ్రామిక డిమాండ్తో పాటు పెట్టుబడి డిమాండ్ కూడా బలంగా ఉండటం ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగాల్లో వెండి వినియోగం పెరుగుతుండటంతో పాటు, బంగారం ధరలు పెరిగినప్పుడు ప్రత్యామ్నాయ పెట్టుబడిగా కూడా వెండిపై ఆసక్తి పెరుగుతోంది.
ఇటీవలి రోజుల్లో మధ్యప్రాచ్య ప్రాంతంలో యుద్ధ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారడం కూడా బులియన్ మార్కెట్కు ఊతమిస్తోంది. హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో వాణిజ్య నౌకలపై దాడులు, చమురు సరఫరాపై నెలకొన్న ఆందోళనలు, అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో అస్థిరత వంటి పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు సాధారణంగా బంగారం, వెండి వంటి విలువైన లోహాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతారు. అందుకే అంతర్జాతీయ మార్కెట్లలో కనిపిస్తున్న ధోరణి దేశీయ ఎంసీఎక్స్ ధరల్లో కూడా ప్రతిబింబిస్తోంది.
మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగితే బంగారం, వెండి ధరల్లో మరింత హెచ్చుతగ్గులు కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ పరిణామాలు, డాలర్ కదలికలు, అంతర్జాతీయ చమురు ధరలు, కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల నిర్ణయాలు రాబోయే రోజుల్లో బులియన్ మార్కెట్ దిశను నిర్ణయించే కీలక అంశాలుగా మారనున్నాయి. అందువల్ల బంగారం లేదా వెండిలో పెట్టుబడులు పెట్టే వారు అంతర్జాతీయ పరిణామాలను, ఎంసీఎక్స్ ధరల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Hyderabad,Telangana

