Last Updated:
అమెరికాకు ఇరాన్ సంచలన సవాల్ విసిరింది. దమ్ముంటే గాల్లోంచి బాంబులు వేయడం కాదని, నేరుగా సైన్యాన్ని పంపి భూమ్మీద యుద్ధం చేయాలని సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మొహసిన్ రెజాయ్ అమెరికాను డిమాండ్ చేశారు.
అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం మరింత వేడెక్కింది. తాజాగా అమెరికా సైనిక వ్యూహాలపై ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మొహసిన్ రెజాయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికాకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే తమ సైనికులను ఇరాన్లోకి పంపి నేరుగా యుద్ధం చేయాలని ఆయన సవాల్ విసిరారు. “అమెరికన్లు అంత పవర్ఫుల్ అయితే వాళ్ల సైనికులు ఎందుకు ఇరాన్లోకి రారు? కేవలం ఆకాశం నుంచి బాంబులు వేసి ఎందుకు పారిపోతున్నారు? ఏదైనా యుద్ధంలో అంతిమ విజయాన్ని నిర్ణయించేది పదాతిదళాలే (గ్రౌండ్ ఫోర్స్).
కానీ అమెరికా ఆ సాహసం చేయడం లేదు” అని రెజాయ్ ఎద్దేవా చేశారు. పర్వతాలు, అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు ఉన్న ఇరాన్లోకి ప్రవేశించి నేరుగా యుద్ధం చేయడం అమెరికాకు సాధ్యం కాదనే ఉద్దేశంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీకి అత్యంత సన్నిహితుడైన రెజాయ్ చేసిన ఈ తాజా ప్రకటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.
న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. ఇరాన్ను దెబ్బతీయడానికి అమెరికా కేవలం వైమానిక దాడులపైనే ఆధారపడుతోంది. అయితే ఇరాన్ తమ సైనిక వ్యూహాలను పూర్తిగా మార్చుకుందని రెజాయ్ స్పష్టం చేశారు. అమెరికా వైమానిక దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టేలా ఇరాన్ బలగాలు మరింత మెరుగ్గా సిద్ధమయ్యాయని వెల్లడించారు. ఒకవేళ వాషింగ్టన్ మళ్లీ దాడులకు తెగబడితే, పశ్చిమాసియా ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడతామని హెచ్చరికలు జారీ చేశారు.
యుద్ధ హెచ్చరికలు చేస్తూనే మరోవైపు ఇరాన్ శాంతి చర్చలకు కూడా తలుపులు తెరిచి ఉంచింది. యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఖతార్ ద్వారా కొన్ని షరతులను పంపినట్లు రెజాయ్ స్వయంగా వెల్లడించారు. అన్ని సరిహద్దుల్లో యుద్ధాన్ని తక్షణం ఆపాలని, ఫ్రీజ్ చేసిన ఇరాన్ నిధులను విడుదల చేయాలని, నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని అందులో స్పష్టం చేశారు. ట్రంప్ ఇచ్చే సమాధానం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి పాకిస్థాన్, ఖతార్ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఒకవేళ అమెరికా తమ షరతులను తిరస్కరిస్తే మాత్రం భయంకరమైన యుద్ధానికి ఇరాన్ సిద్ధంగా ఉందని రెజాయ్ తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఈ పరిణామాల వల్ల ప్రపంచ ఇంధన మార్కెట్లకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇది అంతర్జాతీయంగా చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

