Last Updated:
Ketan Agarwal Murder Case: మహారాష్ట్రలోని పుణె జిల్లా లోహగఢ్ కోటపై నుంచి ప్రమాదవశాత్తు జారిపడి చనిపోయాడని భావించిన 26 ఏళ్ల వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మృతి కేసు కీలక మలుపు తిరిగింది.
ఇది ప్రమాదం కాదని, పక్కా ప్రణాళికతో చేసిన హత్య అని తేల్చిన పుణె రూరల్ పోలీసులు వడ్గావ్ మావల్ కోర్టులో ఏకంగా 5,053 పేజీల భారీ ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. ఈ అభియోగపత్రంలో కేతన్ కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిల పాత్రను పోలీసులు వివరంగా పొందుపరిచారు. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, డిజిటల్ ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక విశ్లేషణలను ఆధారాలుగా సమర్పించారు.
పోలీసులు సుమారు 80 నుంచి 85 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు. నేరం జరుగుతున్న సమయంలో సియా, చేతన్లను చూసిన ముగ్గురు ప్రత్యక్ష సాక్షుల వివరాలను కూడా ఛార్జ్షీట్లో చేర్చారు. వాట్సాప్ సంభాషణలు, ఫోటోలు, మొబైల్ డేటా, కాల్ డేటా రికార్డులు (CDRs), ఫోరెన్సిక్ సర్టిఫికెట్లను కోర్టుకు సమర్పించారు. లోహగఢ్ కోటపై 2025లో ఓ మహిళ అనుమానాస్పదంగా పడి చనిపోయిన ఘటనతో పాటు, సోనమ్ రఘువంశీ హత్య కేసు వివరాలను సియా ఆన్లైన్లో వెతికినట్లు దర్యాప్తులో గుర్తించారు.
జూన్ 18న కేతన్ తన కాబోయే భార్య సియా, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి లోహగఢ్ కోటకు వెళ్లాడు. కొండ అంచున ఫోటోలు తీసుకుంటూ ప్రమాదవశాత్తు సుమారు 400 అడుగుల లోయలో పడి మరణించాడని తొలుత భావించారు. అయితే, కోట టికెట్ కౌంటర్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, హుడీ ధరించిన ఓ వ్యక్తి వీరిని వెంబడించడం కనిపించింది. అతడిని చేతన్ చౌదరిగా గుర్తించడంతో దర్యాప్తు హత్య కోణంలోకి మళ్లింది.
సంఘటన జరిగిన రోజు చేతన్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5:40 గంటల వరకు తన మొబైల్ ఫోన్ను ఆఫీసులోనే వదిలేసి, ఇంటర్నెట్ను నిలిపివేసినట్లు పోలీసులు కనుగొన్నారు. సియా, చేతన్ మధ్య వేల సంఖ్యలో కాల్స్, సుదీర్ఘ సంభాషణలు జరిగినట్లు కాల్ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం వల్లే కేతన్ను అంతమొందించేందుకు పథకం పన్నినట్లు తేలింది.
జూన్ 18కి ముందే, అంటే జూన్ 14న కూడా సియా కేతన్ను లోహగఢ్ కోటకు తీసుకెళ్లి కొండపై నుంచి తోసేయడానికి ప్రయత్నించినట్లు దర్యాప్తులో బయటపడింది. అప్పుడు కేతన్ పొదలను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు.ప్రస్తుతం సియా, చేతన్ ఇద్దరూ పోలీసుల కస్టడీలో ఉన్నారు. విచారణలో వారి నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. సమగ్ర ఆధారాలతో కూడిన ఛార్జ్షీట్ సమర్పించడంతో తదుపరి న్యాయ విచారణ వేగవంతం కానుంది.

