పిడుగుపాటు..ఇద్దరికి తృటిలో తప్పిన ప్రమాదం
పిడుగు ప్రభావంతో రెండు సెల్ఫోన్లు పేలుడు..
ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స
ప్రభ న్యూస్ కామారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 20
గాంధారి మండలం పొప్పాజీవాడి గ్రామ పరిధిలో పత్తి పొలాల సమీపంలో పిడుగు పడటంతో ఇద్దరు రైతులకు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో బూరుగుల్ గ్రామానికి చెందిన గయని శంకర్ (40), పొప్పాజీవాడి గ్రామానికి చెందిన సూర్యకాంతం (40) పిడుగు ప్రభావానికి గురయ్యారు.
పిడుగు ప్రభావంతో వారి వద్ద ఉన్న రెండు సెల్ఫోన్లు పేలిపోయినట్లు సమాచారం. అయితే అదృష్టవశాత్తూ ఇద్దరికీ ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం వారి పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు తెలిసింది.
ప్రమాదం అనంతరం వారిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. ఘటనపై పోలీస్ ఔట్పోస్ట్ సిబ్బంది వివరాలు సేకరిస్తున్నారు.
పిడుగుపాటు సమయంలో అప్రమత్తతే రక్షణ
వర్షాలు, ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో రైతులు పొలాల్లో, చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షితమైన భవనాల్లోకి వెళ్లాలి. ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో మొబైల్ఫోన్ వినియోగాన్ని నివారించడం, విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఈ ఘటనలో సెల్ఫోన్లు పేలడం పిడుగు ప్రభావం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో సూచిస్తోంది.


