Last Updated:
Shabad Murders: రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దైవలాగూడలో మానవత్వాన్ని నిలువునా పూడ్చిపెట్టిన అత్యంత దారుణ ఉదంతం వెలుగుచూసింది.
ఓ ఉన్మాది కత్తితో తెగబడి ఒకే రోజున భార్యాపిల్లలతో సహా మొత్తం ఆరుగురిని పీకలు కోసి కిరాతకంగా హతమార్చాడు. ఈ సంచలన ఘటనపై స్పందించిన పోలీసులు నిందితుడు రాజ్కుమార్ ఆచూకీ తెలిపిన వారికి రూ.2 లక్షల రివార్డు అందజేస్తామని ప్రకటించారు. మరోవైపు, ఈ కేసులో విధుల్లో నిర్లక్ష్యం వహించిన షాబాద్ ఎస్సై రమేష్ను సస్పెండ్ చేస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి వెల్లడించారు.
పోలీసుల దర్యాప్తు వివరాల ప్రకారం.. దైవలాగూడకు చెందిన రాజ్కుమార్పై గతంలో ఒక మైనర్ బాలిక (17) పోక్సో (POCSO) కేసు పెట్టింది. ఈ కక్షతో రగిలిపోయిన నిందితుడు శనివారం ఉదయం షాబాద్ పీఆర్ ఆర్ స్టేడియం సమీపంలో ఉన్న సదరు మైనర్ బాలిక ఇంట్లోకి చొరబడ్డాడు. బాలికను బలవంతంగా లాక్కెళ్లేందుకు ప్రయత్నించగా, ఆమె తల్లి లక్ష్మి, నాయనమ్మ రుక్మిమ్మ అడ్డుపడ్డారు. దీంతో ఉన్మాదిగా మారిన రాజ్కుమార్ వారిద్దరినీ కత్తితో పొడిచి అక్కడికక్కడే చంపేశాడు.
అనంతరం ఆ బాలికను దైవలాగూడ సమీపంలోని అఖిల్ సాగర్ చెరువు వద్దకు తీసుకెళ్లి పీక కోసి దారుణంగా హత్య చేశాడు. అంతటితో ఆగని నిందితుడు, నేరుగా దైవలాగూడలోని తన ఇంటికి వచ్చి భార్య సరిత (33), చిన్నారి కుమారులు పరీక్షిత్ (4), దైవిక్షిత్ (2)లను సైతం కత్తితో పీకలు కోసి కిరాతకంగా హతమార్చాడు.
ఈ ఘోర ఉదంతంపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులో విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని చెప్తూ ఎస్సైని సస్పెండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు రాజ్కుమార్ కోసం పోలీసులు 10 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ (CCTV) దృశ్యాలు, టోల్ప్లాజా వివరాల సాయంతో దర్యాప్తును వేగవంతం చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Hyderabad,Telangana

