Last Updated:
ఎన్ఎస్ఈ ఐపీఓ సైజు తగ్గే అవకాశం ఉంది. 6% నుండి 5.2-5.5%కి ఓఎఫ్ఎస్ తగ్గవచ్చు. ఐపీఓ విలువ రూ.30,000 కోట్ల నుండి రూ.25,000-27,000 కోట్లకు పరిమితం కావచ్చు.
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) ఐపీఓ సైజు అంచనా కంటే తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఇంతకుముందు 6 శాతం షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా విక్రయించాలని భావించగా, ఇప్పుడు దాన్ని 5.2-5.5 శాతానికి తగ్గించే అవకాశం ఉంది. కొంతమంది షేర్హోల్డర్లు ఐపీఓలో తమ వాటాను విక్రయించకూడదని నిర్ణయించుకోవడమే దీనికి కారణమని ఈ విషయం గురించి తెలిసిన వ్యక్తులు బుధవారం తెలిపారని పీటీఐ వెల్లడించింది. ఓఎఫ్ఎస్ సైజు తగ్గితే మొత్తం ఐపీఓ విలువ కూడా తగ్గుతుంది. గతంలో రూ.30,000 కోట్లుగా అంచనా వేసిన ఇష్యూ సైజు ఇప్పుడు రూ.25,000-27,000 కోట్లకు పరిమితం కావచ్చని తెలుస్తోంది. ఈ స్థాయిలో ఐపీఓ వస్తే, భారత్లో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద పబ్లిక్ ఆఫరింగ్గా నిలిచే అవకాశం ఎన్ఎస్ఈకి ఉండకపోవచ్చు. ప్రస్తుతం రూ.27,870 కోట్లతో హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీఓ ఆ రికార్డును కలిగి ఉంది.

