Last Updated:
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. కీలక పథకాల పురోగతితో పాటు కేంద్ర మంత్రుల వ్యక్తిగత పనితీరును కూడా ఆయన నేరుగా పరిశీలించనున్నారు.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమ ఎజెండా అమలుపై సమగ్ర సమీక్షకు సిద్ధమైంది. వివిధ కీలక రంగాల్లో ప్రభుత్వ పనితీరు, ప్రధాన సంక్షేమ పథకాల క్షేత్రస్థాయి ఫలితాలను అంచనా వేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. కేవలం సాధారణ శాఖల సమీక్షగానే కాకుండా, వ్యక్తిగతంగా ఆయా శాఖల మంత్రులు, సహాయ మంత్రుల పనితీరును కూడా ప్రధాని నిశితంగా పరిశీలించనున్నారు. ఈ కీలక భేటీకి కేంద్ర మంత్రులతో పాటు స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులు, సహాయ మంత్రులందరికీ పిలుపు అందింది.

