Last Updated:
PM Modi: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, కేవలం సిలబస్ బోధనకే పరిమితం కాకుండా విద్యార్థులలోని ప్రతిభను వెలికితీస్తూ వారిలో బాల్యం చనిపోకుండా కాపాడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో ప్రధాని ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ ఆత్మీయ కలయికలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశానికి అందించిన విశిష్ట సేవలను ఆయన స్మరించుకున్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు తమ తరగతి గదుల్లో అమలు చేస్తున్న వినూత్న విద్యాబోధన పద్ధతులను ప్రధానితో పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని చేసిన చమత్కారాలు హాలులో నవ్వుల పువ్వులు పూయించాయి. పిల్లలకు ఇంటర్వ్యూలు చేయడం నేర్పిస్తున్నానని ఓ ఉపాధ్యాయురాలు చెప్పగా.. “అలాగైతే మీ పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులను కూడా వంట ఎందుకు చేశారంటూ ప్రశ్నిస్తున్నారా?” అని మోదీ సరదాగా వ్యాఖ్యానించారు. అలాగే విద్యార్థులకు పబ్లిక్ స్పీకింగ్ నేర్పించే మరో టీచర్ను ఉద్దేశించి.. “నేను మీ స్టూడెంట్ని అనుకుంటే, మంచి వక్తగా ఎదగడానికి నాకు ఎలాంటి చిట్కాలు ఇస్తారు?” అని ప్రధాని అడగడంతో వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారింది.

