Last Updated:
Sai Krishna Lockup Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో అన్నింటికీ కారణం సీఐ నాగరాజే అని ఆరోపణలు వస్తున్న వేళ.. ఆయన్ని సిట్ ప్రశ్నించేందుకు రెడీ అవుతున్న సమయంలో.. ఆయన సంచలన లేఖ రాశారు. అసలు ఈ కేసులో తనను బలి చేస్తున్నారని అనడం కలకలం రేపుతోంది.
విజయవాడలోని గడే సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు తీవ్ర సంచలనాలకు దారితీస్తోంది. సస్పెండ్ అయిన కృష్ణలంక సీఐ నాగరాజు కోర్టుకు లేఖ రాశారు. అందులో సిట్పై తీవ్ర ఆరోపణలు చేశారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) తనను బలవంతంగా ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తోందనీ, లాకప్ డెత్ కేసును ఒప్పుకోవాలని బలవంతం చేస్తోందని అన్నారు. టార్చర్ చేసైనా తనతో ఒప్పించాలని చూస్తోందనీ.. సిట్ తనను టార్చర్ చేయకుండా కోర్టు రక్షణ కల్పించాలని కోరారు. విచారణ అవసరమైతే లాయర్ల సమక్షంలోనే జరపాలని, అసలు ఈ కేసులో తనను విచారించాల్సిన అవసరమే లేదని ఆయన లేఖలో అన్నారు.
ది హిందూ రిపోర్టు ప్రకారం జూన్ 23న సిట్ బృందం.. సీఐ నాగరాజును అరెస్టు చేసి ప్రాథమికంగా విచారించింది. ఆయన కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీఐగా ఉన్నప్పుడు సాయి కృష్ణను మే 6 లేదా 9న మార్కాపురం నుంచి అక్రమంగా అదుపులోకి తీసుకున్నారనీ, 24 గంటల్లో మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయకుండా.. అక్రమ నిర్బంధం చేశారని SIT రిమాండ్ రిపోర్టులో తెలిపింది. సీఐ నాగరాజు అప్పటికే సస్పెండ్ అయ్యారు.
జూన్ 24-25లో కోర్టు.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించింది. SIT ఐజి (లా అండ్ ఆర్డర్) ఎం. రవి ప్రకాష్ నేతృత్వంలో దర్యాప్తు జరుపుతోంది. సాయి కృష్ణ మృతదేహం ఇంకా లభించలేదు. పోలీసులు దాన్ని మాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. SIT రిపోర్టు ప్రకారం, కస్టడీలో థర్డ్ డిగ్రీ వల్ల గాయాలతో సాయికృష్ణ మరణించాడని నిర్ధారణ అయింది. మృతదేహాన్ని మాయం చెయ్యడంలో సీఐ స్నేహితుడు సురేష్, హెడ్ కానిస్టేబుల్స్ అశోక్, జంగం నాని పాత్ర ఉన్నట్లు SIT గుర్తించింది. సురేష్ను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు.
తాజాగా సీఐ నాగరాజును 8 రోజులు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించేందుకు కోర్టు ఒప్పుకుంది. ఆ క్రమంలో.. కస్టడీ పిటిషన్ విచారణలో సీఐ నాగరాజు వీడియో కాల్ ద్వారా మాట్లాడుతూ తనకు ఈ కేసుతో సంబంధం లేదనీ, ఉద్దేశపూర్వకంగా ఇరికిస్తున్నారనీ, కస్టడీలో టార్చర్ చేసి తప్పుడు వాంగ్మూలం తీసుకునే ప్రమాదం ఉందనీ, ప్రాణహాని ఉందని ఆరోపించారు. లాయర్ల సమక్షంలో విచారణ జరపాలని కోరారు. కోర్టు ఆయన అభ్యంతరాల్ని రికార్డు చెయ్యాలని SITని ఆదేశించింది.
విజయవాడ కోర్టు.. నాగరాజును విచారించేటప్పుడు వీడియో, ఆడియో రికార్డింగ్ చెయ్యాలని సిట్ని ఆదేసించింది. ఇది దర్యాప్తుకి కీలకం. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి జ్యుడీషియల్ ఇన్క్వైరీ, CBI దర్యాప్తు కోరుతున్నారు. CCTV ఫుటేజ్ కనిపించలేదు. దాంతోపాటూ ఇతర ఆధారాల్ని నాగరాజు దాచిపెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరి తాజా లేఖను కోర్టు లెక్కలోకి తీసుకుంటుందా, లాయర్ల సమక్షంలో విచారణ జరిపిస్తుందా అనేది చూడాలి.
SIT దర్యాప్తు ఇప్పటికే ముఖ్యమైన దశలో ఉంది. సాయి కృష్ణ నిర్బంధం, థర్డ్ డిగ్రీ, మృతదేహం మాయం, ఆధారాలు ధ్వంసం వంటి అంశాలపై దృష్టి సారించింది. నాగరాజును లోతుగా ప్రశ్నించాక.. దర్యాప్తు మరింత విస్తరించవచ్చు.
Hyderabad,Telangana
Jul 03, 2026 10:59 AM IST

