పాలసీలను మధ్యలోనే సరెండర్ చేయడానికి అనేక కారణాలు ఉన్నాయని బీమా నియంత్రణ సంస్థ IRDAI తెలిపింది. పాలసీ కొనుగోలు సమయంలో ఉత్పత్తి సరైన విధంగా అర్థం కాకపోవడం, ప్రీమియం చెల్లించే ఆర్థిక సామర్థ్యం తగ్గిపోవడం, పాలసీదారుల అంచనాలకు అనుగుణంగా ప్రయోజనాలు లేకపోవడం, తప్పుదారి పట్టించే అమ్మకాలు (Mis-selling), బీమా ఉత్పత్తులపై సరైన అవగాహన లేకపోవడం, అలాగే వ్యక్తిగత ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు వంటి అంశాలు ఇందుకు ప్రధాన కారణాలుగా గుర్తించింది. ఈ ధోరణిని IRDAI నిరంతరం పర్యవేక్షిస్తోందని ప్రభుత్వం తెలిపింది. పాలసీల సరెండర్లు, ఉపసంహరణలు, పాలసీల కొనసాగింపు వంటి అంశాలను విశ్లేషిస్తూ బీమా సంస్థల ఆర్థిక స్థిరత్వం, పాలసీదారుల ప్రయోజనాల పరిరక్షణ, మొత్తం బీమా రంగంపై వాటి ప్రభావాన్ని అంచనా వేస్తోంది. అవసరమైతే ఉత్పత్తుల రూపకల్పన, సమాచార వెల్లడింపు, పాలన ప్రమాణాలు, రిస్క్ మేనేజ్మెంట్ వంటి అంశాల్లో నియంత్రణ చర్యలు కూడా తీసుకుంటున్నట్లు పేర్కొంది. అయితే, పెరుగుతున్న సరెండర్ల వల్ల దేశంలోని కుటుంబాల పొదుపులు, దీర్ఘకాలిక ఆర్థిక భద్రత లేదా బీమా వ్యాప్తిపై ఎలాంటి నిర్దిష్ట అధ్యయనం ఇప్పటివరకు నిర్వహించలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

