Last Updated:
కాకినాడ, అంబేద్కర్ కోనసీమలో వరుస దొంగతనాలు, గోపవరం లో శీలం పార్వతి పై దాడి చేసి బంగారం దోపిడీ, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు, గస్తీ కట్టుదిట్టం చేశారు
కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో వరుస దొంగతనాలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. చైన్ స్నాచింగ్లు, ఇళ్లలో చోరీలు, రాత్రివేళల్లో దోపిడీ ఘటనలు పెరుగుతుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. ముఖ్యంగా చీకటి పడితే దుండగులు ఇళ్లలోకి చొరబడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుండటంతో ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు.
ఇటీవల తుని మండలం హంసవరం గ్రామంలో వరుస చోరీలు చోటుచేసుకోవడంతో గ్రామస్థులు అప్రమత్తమయ్యారు. ఇదే సమయంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన మరో ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉప్పలగుప్తం మండలం గోపవరం గ్రామంలో ఓ మహిళపై దుండగుడు అత్యంత దారుణంగా దాడి చేసి బంగారు ఆభరణాలను అపహరించడం భయానక పరిస్థితులకు అద్దం పడుతోంది.
పోలీసుల వివరాల ప్రకారం, ఇంట్లో నిద్రిస్తున్న శీలం పార్వతి అనే మహిళ కంట్లో దుండగుడు కారంపొడి చల్లి, ఆమె మెడలో ఉన్న సుమారు 20 గ్రాముల బంగారు పుస్తెలతాడును లాక్కొని పరారయ్యాడు. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో బాధితురాలు తీవ్ర భయాందోళనకు గురైంది. ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారడంతో గ్రామస్థులు కూడా భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సమాచారం అందుకున్న అమలాపురం రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించి, ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. దుండగుడి జాడను గుర్తించేందుకు క్లూస్ టీమ్ను రంగంలోకి దింపిన పోలీసులు, సంఘటన స్థలం నుంచి కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఈ దర్యాప్తులో ఉప్పలగుప్తం ఎస్ఐ ఎస్కే జానీ బాషా కూడా పాల్గొని ప్రత్యేక గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
ఇటీవలి కాలంలో వరుస దొంగతనాలు చోటుచేసుకుంటుండటంతో కాకినాడ, కోనసీమ జిల్లాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, రాత్రి వేళల్లో భద్రతా చర్యలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వరుస ఘటనల నేపథ్యంలో గ్రామాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
East Godavari,Andhra Pradesh
Jun 27, 2026 12:49 PM IST

