DDU-GKY 2.0 కింద తొలిదశలో 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో శిక్షణ బ్యాచ్ల ప్రారంభానికి సంబంధించిన సన్నాహకాలను కేంద్రం సమీక్షించింది. ఒడిశా, మిజోరం, సిక్కిం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పుదుచ్చేరి, కర్ణాటక, తెలంగాణ, బీహార్ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2027 డిసెంబర్ 31 నాటికి మొత్తం 3,57,112 మంది గ్రామీణ యువతకు శిక్షణ ఇవ్వాలనే లక్ష్యం ఉంది. ఇందులో భాగంగా అక్టోబర్ 2026లోనే 1,164 శిక్షణ బ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. వీటి ద్వారా దాదాపు 34,920 మంది గ్రామీణ యువత శిక్షణ పొందనున్నారు. ఇదే సమయంలో DDU-GKY 2.0 పోర్టల్ ప్రకారం దేశంలోని 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 1,200కు పైగా ప్రాజెక్టులకు కలిపి 5.6 లక్షల శిక్షణ లక్ష్యాలు కేటాయించారు. మిగిలిన రాష్ట్రాల్లోనూ లక్ష్యాల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోంది. దశలవారీగా నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాల ద్వారా బ్యాచ్ల ప్రారంభ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రం భావిస్తోంది.
DDU-GKY అనేది గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు చెందిన యువతకు ఉపాధితో కూడిన నైపుణ్య శిక్షణ అందించే కేంద్ర ప్రాయోజిత పథకం. ఇందులో ఎంపికైన యువతకు వివిధ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ వ్యవధి కోర్సును బట్టి 3 నెలల నుంచి 12 నెలల వరకు ఉంటుంది. DDU-GKY 2.0 అమలుకు సంబంధించి మొత్తం 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 2026–28 రెండేళ్ల కాలానికి లక్ష్యాలు కేటాయించారు. ఆయా రాష్ట్రాలు తమకు కేటాయించిన లక్ష్యాలను ప్రాజెక్ట్ అమలు సంస్థలకు (PIAలు) త్వరగా కేటాయించి, శిక్షణ బ్యాచ్లను నిర్ణీత సమయంలో ప్రారంభించాలని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సూచించింది.
అక్టోబర్ 31, 2026లోగా శిక్షణ ప్రారంభించేందుకు అవసరమైన లక్ష్యాలను PIAలకు కేటాయించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం అర్హులైన గ్రామీణ యువతను గుర్తించి సమీకరించేందుకు PIAలకు ఇప్పటికే 5 లక్షలకు పైగా లక్ష్యాలు కేటాయించారు. దీంతో చాలా రాష్ట్రాల్లో అక్టోబర్ 2026లోనే యువత సమీకరణతో పాటు శిక్షణ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ పూర్తయితే గ్రామీణ యువతకు ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు నేర్చుకునే అవకాశాలు పెరగనున్నాయి.
DDU-GKY 2.0 కోసం ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ డిజిటల్ పోర్టల్ను సిద్ధం చేశారు. ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి శిక్షణ, పర్యవేక్షణ, చెల్లింపుల వరకు వివిధ ప్రక్రియలను ఒకే డిజిటల్ ప్లాట్ఫారమ్ ద్వారా నిర్వహించడం దీని ఉద్దేశం. దీనివల్ల పనితీరును మెరుగ్గా పర్యవేక్షించడంతో పాటు పారదర్శకత పెంచే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ఖజానా పోర్టల్లతో DDU-GKY 2.0 పోర్టల్ అనుసంధానం ఎక్కడైనా పెండింగ్లో ఉంటే దాన్ని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. గ్రామీణ కౌశల్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ చెల్లింపులకు అవసరమైన అనుసంధానాన్ని సెప్టెంబర్ 30, 2026లోగా పూర్తి చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు ఇచ్చారు.
కొత్త డిజిటల్ ప్లాట్ఫారమ్పై ప్రాజెక్ట్ అమలు సంస్థలకు పూర్తి అవగాహన కల్పించేందుకు అక్టోబర్లో నాలుగు ప్రాంతాల్లో హైబ్రిడ్ విధానంలో ప్రాంతీయ వర్క్షాప్లు నిర్వహించనున్నారు. ఇవి షిల్లాంగ్లో అక్టోబర్ 5, విజయవాడలో అక్టోబర్ 7, ముంబైలో అక్టోబర్ 9, ధర్మశాలలో అక్టోబర్ 16 తేదీల్లో జరగనున్నాయి. ఈ వర్క్షాప్లలో DDU-GKY 2.0 పోర్టల్ ఎలా ఉపయోగించాలి, వివిధ ప్రక్రియలను ఎలా పూర్తి చేయాలి, శిక్షణ కార్యక్రమాలను ఎలా నిర్వహించాలి అనే అంశాలపై PIAలకు అవగాహన కల్పిస్తారు. అమలు సమయంలో ఎదురయ్యే సమస్యలను చర్చించి పరిష్కరించుకునేందుకు కూడా ఈ సమావేశాలు ఉపయోగపడనున్నాయి.
సమీక్షా సమావేశంలో పథకం ఆర్థిక పరిస్థితిపైనా చర్చించారు. అక్టోబర్ 2026 నుంచి కొత్త శిక్షణ బ్యాచ్లు ప్రారంభం కావడంతో శిక్షణకు సంబంధించిన కార్యకలాపాలు పెరుగుతాయని, దానికి అనుగుణంగా పథకం కింద వ్యయం కూడా పెరిగే అవకాశం ఉందని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తెలిపాయి. ఈ సమీక్షా సమావేశం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించారు. నైపుణ్యాల శాఖ సంయుక్త కార్యదర్శి, డైరెక్టర్ (నైపుణ్యాలు), వివిధ రాష్ట్రాలకు చెందిన సీఈవోలు, సీఓఓలు, ఇతర ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. అక్టోబర్ నుంచి ప్రారంభం కానున్న శిక్షణ కార్యక్రమాలు నిర్ణీత లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగేలా చర్యలు తీసుకోవడంపై సమావేశంలో ప్రధానంగా దృష్టి పెట్టారు.
