Last Updated:
బిలాస్పూర్లో పెళ్లికి ముందు వరుడు చెప్పిన విద్య, ఉద్యోగం, ఆస్తుల వివరాలపై వివాహం తర్వాత యువతి కుటుంబం అనుమానాలు వ్యక్తం చేసింది. పెళ్లిలో ఇచ్చిన నగలు నకిలీవని, వివాహానికి ముందు రూ.6.76 లక్షలు తీసుకున్నారని యువతి ఆరోపించడంతో భర్త, అత్తమామలపై కేసు నమోదైంది.
పెళ్లి అంటే పరస్పర నమ్మకంతో కొత్త జీవితాన్ని ప్రారంభించడం. కానీ ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో ఓ వివాహం తర్వాత వరుడు చెప్పిన వివరాలపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. బిట్స్ పిలానీలో చదివానని, ఏడాదికి రూ.48 లక్షల జీతం వస్తుందని, కుటుంబానికి 150 నుంచి 200 ఎకరాల భూమి ఉందని వరుడు చెప్పినట్లు యువతి కుటుంబం ఆరోపిస్తోంది. ఈ వివరాలను నమ్మిన కుటుంబ సభ్యులు వివాహానికి అంగీకరించగా.. 2026 మార్చి 12న బిలాస్పూర్లోని హోటల్ పేట్రిషియన్లో వివాహం జరిగింది. అయితే పెళ్లయిన తొలి రాత్రి నుంచే వరుడు చెప్పిన విషయాలపై అనుమానాలు మొదలయ్యాయని యువతి ఆరోపించింది. పెళ్లిలో ఇచ్చిన నగలు కూడా నకిలీవని ఆరోపణలు రావడంతో భర్తతో పాటు అత్తమామలపై కేసు నమోదైంది.
వరుడి బయోడేటాలో పేర్కొన్న వివరాలు ఆకర్షణీయంగా ఉండటంతో యువతి కుటుంబం పెద్దగా అనుమానించకుండా సంబంధాన్ని ఖరారు చేసుకున్నట్లు సమాచారం. హర్షదీప్ బిట్స్ పిలానీలో బీటెక్ పూర్తి చేశాడని, జైపూర్లోని ఓ కంపెనీలో ఏడాదికి రూ.48 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం చేస్తున్నాడని చెప్పినట్లు యువతి కుటుంబం పేర్కొంది. అంతేకాకుండా అతడి తండ్రి వ్యాపారానికి రూ.88 లక్షల టర్నోవర్ ఉందని, తమ కుటుంబానికి 150 నుంచి 200 ఎకరాల భూమి ఉందని చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ వివరాల ఆధారంగా కుటుంబ సభ్యులు సంబంధాన్ని అంగీకరించడంతో మార్చి 12న వివాహం జరిగింది. అయితే పెళ్లి జరిగిన రోజే పరిస్థితులు మారిపోయాయని యువతి ఆరోపిస్తోంది.
వివాహం జరిగిన రాత్రి టెంట్, క్యాటరింగ్ సిబ్బందికి పూర్తి చెల్లింపులు జరగలేదని చెప్పడంతో చివరకు యువతి కుటుంబ సభ్యులే ఆ బిల్లులను చెల్లించాల్సి వచ్చిందని ఆరోపించారు. మరుసటి రోజు హోటల్ నుంచి బయటకు వస్తున్న సమయంలో వరుడి కారును కూడా కొంతసేపు ఆపినట్లు సమాచారం. ఆ తర్వాత వరుడు, అతడి తండ్రి ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయని యువతి కుటుంబం తెలిపింది.
పరిస్థితులు అనుమానాస్పదంగా అనిపించడంతో యువతి తన భర్తను ప్రశ్నించినట్లు సమాచారం. ఈ క్రమంలో వరుడు తన తండ్రితో కలిసి ఈము పక్షి నూనె వ్యాపారం చేస్తున్నట్లు చెప్పినట్లు యువతి ఆరోపించింది.
మరోవైపు పెళ్లిలో తనకు ఇచ్చిన నగలపై కూడా యువతికి అనుమానం రావడంతో వాటిని పరీక్షించించినట్లు తెలుస్తోంది. ఆ నగలు నకిలీవని పరీక్షల్లో తేలినట్లు ఆమె ఆరోపించింది. అంతేకాకుండా పెళ్లికి ముందు వివిధ అవసరాల పేరుతో తన వద్ద నుంచి సుమారు రూ.6.76 లక్షలు తీసుకున్నారని కూడా యువతి ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
ఈ వ్యవహారంపై యువతి ఫిర్యాదు చేయడంతో భర్త హర్షదీప్తో పాటు అత్తమామలపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. వరుడు చెప్పిన విద్యార్హతలు, ఉద్యోగం, ఆస్తులు, వ్యాపార వివరాలు నిజమా? వివాహ సమయంలో ఇచ్చిన నగలు నకిలీవేనా? యువతి నుంచి డబ్బులు తీసుకున్నారా? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చే ఆధారాల ఆధారంగా కేసులో తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

