ఐఆర్సీటీసీ ఈ టూర్ను మూడు కేటగిరీల్లో అందిస్తోంది. స్లీపర్ క్లాస్ ప్రయాణంతో ఉండే ఎకానమీ ప్యాకేజీ ధర పెద్దలకు రూ.15,800. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు రూ.14,800. 3ఏసీ ప్రయాణంతో ఉండే స్టాండర్డ్ ప్యాకేజీ పెద్దలకు రూ.23,200, పిల్లలకు రూ.22,000గా ఉంది. 2ఏసీ ప్రయాణంతో ఉండే కంఫర్ట్ ప్యాకేజీ పెద్దలకు రూ.29,600, పిల్లలకు రూ.28,100గా నిర్ణయించారు. ఈ ధరల్లో జీఎస్టీ కూడా కలిసే ఉంటుంది. రైలు టూరిజాన్ని ప్రోత్సహించేందుకు భారత్ గౌరవ్ ట్రైన్ పథకం కింద భారతీయ రైల్వే సుమారు 33 శాతం రాయితీ ఇస్తోందని ఐఆర్సీటీసీ తెలిపింది. ప్రకటించిన ప్యాకేజీ ధరల్లో ఈ రాయితీ ఇప్పటికే కలిపి ఉంది. ప్యాకేజీలో రైలు ప్రయాణం, హోటల్ వసతి, స్థానిక రవాణా, భోజనం, టూర్ మొత్తం సమయంలో సహాయం ఈ ప్యాకేజీలో ఉంటాయి. ఎంచుకున్న కేటగిరీని బట్టి స్లీపర్ క్లాస్, 3ఏసీ లేదా 2ఏసీలో ప్రయాణించాలి. బడ్జెట్ హోటళ్లలో వసతి కల్పిస్తారు. ప్యాకేజీని బట్టి నాన్-ఏసీ లేదా ఏసీ గదులు ఇస్తారు. ప్రయాణికులు ఎంచుకున్న కేటగిరీ ప్రకారం నాన్-ఏసీ లేదా ఏసీ వాహనాల్లో స్థానిక రవాణా సదుపాయం కూడా ఉంటుంది. ఉదయం టీ, టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ప్యాకేజీలో భాగంగా ఉంటాయి. మొత్తం ప్రయాణంలో వెజిటేరియన్ భోజనమే అందిస్తారు. ప్రయాణికులకు ట్రావెల్ ఇన్సూరెన్స్, ప్రొఫెషనల్ టూర్ ఎస్కార్ట్స్, రైలులో సెక్యూరిటీ, ఐఆర్సీటీసీ టూర్ మేనేజర్ల సేవలు కూడా ప్యాకేజీలో ఉన్నాయి. టూర్ మేనేజర్లు ప్రయాణికులతో పాటు ప్రయాణిస్తూ అవసరమైన సహాయం చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)

