Last Updated:
కష్టపడి సివిల్స్ కొట్టిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. దర్యాప్తు ప్రారంభం కావడంతో.. ఈ కేసు ఏపీ, తెలంగాణ, కర్ణాటకతోపాటూ.. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.
హైదరాబాద్.. శివరాంపల్లిలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (SVPNPA / NPA)లో.. ట్రైనీ ఐపీఎస్ అధికారుల మధ్య లైంగిక వేధింపులు, శారీరక దాడులు, బ్లాక్మెయిల్ ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. కర్ణాటకకు చెందిన 30 ఏళ్ల మహిళా ట్రైనీ ఐపీఎస్ హెచ్కె సుమా.. తన సహచర ట్రైనీ ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తు ప్రారంభమైంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఫిర్యాదు ప్రకారం, ఉదయ్ కృష్ణారెడ్డి జూన్ 23 నుంచి సుమా.. వాట్సాప్కి అసభ్యకరమైన, లైంగిక సందేశాలు పంపుతూ వేధించడం ప్రారంభించాడు. అకాడమీలో స్నేహితుల ముందు తెలుగులో అమర్యాదకర పదాలు ఉపయోగించి మాట్లాడి.. ఆమె గౌరవాన్ని దెబ్బతీశాడు. ఆమెకు తెలుగు రాదు కాబట్టి.. అతను ఏమంటున్నాడో ఆమెకు అప్పుడు తెలియలేదు. ఆమెకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేశాడు. జులై 8న ఆమె మొబైల్ లాక్కొని.. బలవంతంగా పాస్వర్డ్ తెలుసుకున్నాడు. జులై 9 రాత్రి 9 గంటలకు జుట్టు పట్టుకొని గదిలోకి లాక్కెళ్లి, గొంతు నొక్కి, మెడపై కత్తి పెట్టి బెదిరించాడు. ఆమె ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేసి.. భర్తకు పంపి బ్లాక్మెయిల్ చేశాడు. ఇవన్నీ ఆమె చేసిన ఆరోపణులు. జులై 10న కూడా అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆమె ఇచ్చిన కంప్లైంట్లో ఉంది.
ఈనాడు రిపోర్ట్ ప్రకారం.. పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 74, 75, 77, 315(2), ఐటీ యాక్ట్ సెక్షన్ 66E, 67A కింద కేసు రాశారు. దర్యాప్తు మొదలైంది. ఉదయ్ కృష్ణారెడ్డి తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. అవి అసత్యమనీ, తాను పరువునష్టం కేసు వేస్తానని చెప్పారు. ఆయన ఏపీ ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం గ్రామానికి చెందినవారు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో నానమ్మ దగ్గర పెరిగాడు. కూరగాయలు అమ్ముతూ జీవనం సాగించాడు. 2013లో కానిస్టేబుల్గా ఎంపికై 2018 వరకు సేవ చేశాడు. ఒక సీఐ అవమానించడంతో రాజీనామా చేసి.. సివిల్స్కి ప్రిపేర్ అయ్యాడు. 4 ప్రయత్నాల తర్వాత 5వ సారి 360 ర్యాంకుతో ఐపీఎస్కు సెలెక్ట్ అయ్యాడు. తద్వారా చాలా మందికి ప్రేరణగా నిలిచాడు. కానీ ఇప్పుడు ఆయనపై నెగెటివ్ రిమార్క్స్ వస్తున్నాయి.
ఈ ఘటన పోలీస్ ట్రైనింగ్ సంస్థలో ఉన్నత హోదా అభ్యర్థుల మధ్య కూడా లైంగిక వేధింపులు ఎంత తీవ్రంగా ఉన్నాయో చూపిస్తోంది. NPAలో సీసీటీవీ కెమెరాలు ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసు వర్గాలు దర్యాప్తును గోప్యంగా కొనసాగిస్తున్నాయి. ఐతే.. మరింత మంది బాధితులు ఉండి ఉండొచ్చని తెలుస్తోంది. వారు త్వరలో తెరపైకి వస్తారనే చర్చ జరుగుతోంది. ఉదయ్ గతంలో కూడా సహచరులతో అనుచితంగా ప్రవర్తించినట్లు ప్రాథమిక సమాచారం ఉంది.
ఈ కేసు ఐపీఎస్ ఎంపిక ప్రక్రియ, శిక్షణా వ్యవస్థలో మానసిక స్థిరత్వం, లింగ సమానత్వం వంటి అంశాలపై చర్చను రేకెత్తించింది. మహిళా అధికారుల భద్రత, సేఫ్టీ మెకానిజమ్స్ బలోపేతం చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. NPA అధికారులు ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు, కానీ దర్యాప్తుకి పూర్తి సహకారం అందిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ఉదయ్ కృష్ణారెడ్డి ఐపీఎస్ హోదా, శిక్షణపై ఇప్పుడు అనిశ్చితి ఉంది. కేసు తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.
ఈ సంఘటన సమాజంలో మహిళల భద్రతపై ఆందోళనను కలిగిస్తోంది. ఉన్నత స్థాయి సంస్థల్లో కూడా వేధింపులు ఎదురవుతున్నాయా అనే ప్రశ్నను రేకెత్తిస్తోంది. పోలీసులు త్వరగా న్యాయం అందించాలని బాధితురాలి వర్గాలు కోరుతున్నాయి.
Hyderabad,Telangana

