Last Updated:
ఈ ఏడాది భారత్ ఆతిథ్యమిస్తున్న 18వ బ్రిక్స్ సదస్సుకు చైనా తమ పూర్తి మద్దతు ప్రకటించింది. ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరగనున్న ఈ సదస్సులో మోదీ, జిన్పింగ్ మధ్య జరిగే ద్వైపాక్షిక భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
భారత్ వేదికగా జరుగుతున్న 18వ బ్రిక్స్ (BRICS) సదస్సుకు చైనా తమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ ఏడాది సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించేందుకు తాము అండగా ఉంటామని దేశంలో చైనా రాయబారి జు ఫీహాంగ్ శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి బీజింగ్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన పోస్ట్ను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రీట్వీట్ చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు ప్రధాని మోదీ న్యూఢిల్లీలోని భారత్ మండపం వీడియోను పంచుకుంటూ, 2026 బ్రిక్స్ సదస్సుకు అంతా సిద్ధమైందని ప్రకటించారు. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరిగే ఈ ప్రతిష్టాత్మక సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా పలు దేశాల అధినేతలు ఢిల్లీ చేరుకుంటున్నారు. భారత్లోని చైనా ఎంబసీ అధికార ప్రతినిధి యు జింగ్ కూడా ప్రధాని మోదీ పోస్ట్ను రీషేర్ చేస్తూ బీజింగ్ మద్దతును పునరుద్ఘాటించారు. ఈ సదస్సు ద్వారా ఆసియా ఖండంలోని దేశాల మధ్య బంధం మరింత బలపడే అవకాశం ఉంది.

