కడప స్టీల్ ప్లాంట్ ప్రత్యేకతలు ఏమిటి?:
ఈ ప్లాంట్ సున్నపురాళ్లపల్లె, పెద్దండ్లూరు గ్రామాల మధ్య సుమారు 3,500 ఎకరాలలో ఏర్పాటవుతోంది. ఇది గ్రీన్ స్టీల్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. ఈ ప్లాంట్.. ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ (EAF) ఉపయోగించి.. కర్బన ఉద్గారాలను తగ్గించి పర్యావరణ స్నేహపూర్వకంగా ఉత్పత్తి చేస్తుంది.
– సంవత్సరానికి మొత్తం 3 మిలియన్ టన్నుల (MTPA) స్టీల్ ఉత్పత్తి చేస్తుంది.
– ఫేజ్-1: 1 MTPA. ఇది ప్రారంభ దశ. సుమారు రూ.4,500 కోట్లు దీనికి అవసరం.
– ఫేజ్-2: అదనపు 2 MTPA. మొత్తం ప్రాజెక్టు పెట్టుబడి రూ.16,350 కోట్ల దాకా ఉంది.
ఇది రాయలసీమలోని ఖనిజ వనరులను అంటే.. ఇనుప ఖనిజాన్ని ఉపయోగించి, దేశీయ స్టీల్ ఉత్పత్తిని పెంచుతుంది. 2028-29 నాటికి మొదటి దశ పూర్తి కావాలనే లక్ష్యం ఉంది. అంటే.. అసెంబ్లీ ఎన్నికల నాటికి.. మొదటి దశ పూర్తయ్యేలా కూటమి ప్రభుత్వం ప్లాన్ చేసింది.
ఈ ప్లాంట్ నేరుగా 2,500 మందికి ఉపాధి కల్పిస్తుంది. అంటే.. ఫేజ్-1లో సుమారు 1,000 మంది, ఫేజ్-2లో 1,500 మంది ఉపాధి పొందుతారు. పరోక్షంగా 20,000-25,000 మందికి ఉద్యోగాలు.. ట్రాన్స్పోర్ట్, సప్లయ్ చైన్, అనుబంధ పరిశ్రమల నుంచి వస్తాయని అంచనా.
సాధారణ ప్రజలపై ప్రభావం:
– కడప, అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల యువకులకు ఉద్యోగాలు రాగలవు. ఎందుకంటే.. మొత్తం ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే ఇవ్వాలనే కండీషన్ని గత వైసీపీ ప్రభుత్వం తెచ్చింది.
– స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ద్వారా ఇంజినీర్లు, టెక్నీషియన్లు, లేబర్ ఫోర్స్కు అవకాశాలు లభిస్తాయి.
– చిన్న చిన్న వ్యాపారాలైన హోటళ్లు, లాజిస్టిక్స్, మెటీరియల్ సప్లై కూడా బూమ్ అవుతాయి. హైదరాబాద్లో ఉద్యోగం చేసే రాయలసీమ యువకులు స్వంత ఊరికి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ వల్ల పరోక్ష ఉపాధి ఎలా పెరిగిందో చూస్తే… ఇక్కడ కూడా అలా పెరగగలదు. ఐతే.. ఇదివరకు కడప స్టీల్ ప్లాంట్కి ఇలాగే శంకుస్థాపనలు జరిగాయి. కానీ.. ప్లాంట్ నిర్మాణం జరగలేదు. ఇప్పుడు జరిగితే, గొప్ప విషయమే అవుతుంది.
దీని వల్ల రాయలసీమ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. రాష్ట్ర GDPకి బూస్ట్ ఇస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చెంది.. రోడ్లు, రైల్వే, పవర్ డెవలప్ అవుతాయి. గ్రీన్ టెక్నాలజీతో పర్యావరణ సంరక్షణ మెరుగవుతుంది. ది హిందూ రిపోర్టు ప్రకారం.. ఈ ప్రాజెక్టు.. రాష్ట్ర విభజన చట్టం హామీలను నెరవేర్చడంలో భాగంగా ఉంది.
ఈ ప్లాంట్ వల్ల కడప ఇండస్ట్రియల్ హబ్గా మారుతుంది. మైనింగ్, లాజిస్టిక్స్, అనుబంధ ఇండస్ట్రీలు వస్తాయి. తెలంగాణ, ఆంధ్ర యువతకు క్రాస్-బార్డర్ అవకాశాలు కూడా ఉంటాయి. సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవలి ప్రకటనల్లో రాయలసీమను మేన్యుఫాక్చరింగ్ హబ్గా మార్చే ఆశయాన్ని వ్యక్తం చేశారు. సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు ఇది గేమ్ చేంజర్. ఒక యువకుడు ఇంజినీరింగ్ చదివి ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లకుండా స్వంత జిల్లాలోనే స్థిరపడవచ్చు. నేటి శంకుస్థాపన.. రాయలసీమ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం. ఇది విజయవంతం కావాలంటే ప్రభుత్వం, కంపెనీ, స్థానికులు కలిసి కృషి చేయాలి.
