Last Updated:
ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన అభ్యంతరకరమైన, మార్ఫింగ్ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో ప్రసారం చేసినందుకు మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టను దిగజార్చేలా సామాజిక మాధ్యమాల్లో మార్ఫింగ్ వీడియోలు, అసభ్యకరమైన చిత్రాలు షేర్ చేసిన ఘటనపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తీవ్రంగా స్పందించారు. ఈ వివాదంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్తో పాటు ఆయా ఖాతాల నిర్వాహకులపై ఏకంగా రెండు వేర్వేరు కేసులు నమోదు చేసినట్లు న్యూస్18 కథనం పేర్కొంది. బీజేపీ మద్దతుదారులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నారు.
నీట్ పేపర్ లీక్ ఆందోళనల సమయంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో ఈ తప్పుదోవ పట్టించే కంటెంట్ ఎక్కువగా సర్క్యులేట్ అయినట్లు ఫిర్యాదుదారులు ఆరోపించారు. దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, ప్రజా శాంతికి భంగం కలిగించేలా ఉన్న ఈ పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ అధికారులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తును వేగవంతం చేశారు.
వ్యాపారవేత్త ఎస్ అరవింద్ రెడ్డి, తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా కోర్ కమిటీ సభ్యుడు టి సాయికిరణ్ గౌడ్ వేర్వేరుగా ఈ ఫిర్యాదులు చేశారు. ఇన్స్టాగ్రామ్లో తాను చూసిన ఏఐ జనరేటెడ్ వీడియోల్లో ప్రధాని మోదీతో పాటు మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోటోలను మార్ఫింగ్ చేశారని అరవింద్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పుడు సమాచారంతో సమాజంలో విద్వేషాలు చెలరేగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు నిందితులపై కఠిన సెక్షన్లు నమోదు చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 66-సీ (గుర్తింపు దొంగతనం), సెక్షన్ 67 (అసభ్యకరమైన కంటెంట్ ప్రచురించడం) కింద కేసులు బుక్ చేశారు. వీటితో పాటుగా భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) లోని సెక్షన్ 353(2), 336(4) కింద కూడా అభియోగాలు నమోదు చేశారు.
కేసు నమోదు చేసిన అనంతరం సైబర్ క్రైమ్ పోలీసులు మెటా సంస్థకు అధికారికంగా నోటీసులు జారీ చేశారు. ఫిర్యాదుదారులు రిపోర్ట్ చేసిన అభ్యంతరకరమైన లింక్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఈ తప్పుడు వీడియోలను పోస్ట్ చేసిన ఖాతాల వివరాలు ఇవ్వాలని కోరారు. ఆయా సోషల్ మీడియా అకౌంట్లను నిర్వహిస్తున్న ఆకతాయిలను గుర్తించి త్వరలోనే అరెస్టు చేస్తామని సైబర్ క్రైమ్ అధికారులు వెల్లడించారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Jul 31, 2026 11:16 AM IST

