జూన్లో దేశవ్యాప్తంగా వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మే నెలలోని 3.93 శాతం నుంచి 4.38 శాతానికి పెరిగింది. నెలవారీ ప్రాతిపదికన వినియోగదారుల ధరలు 1.03 శాతం పెరగడం 2025 ఫిబ్రవరి తర్వాత నమోదైన అత్యధిక నెలవారీ పెరుగుదలగా నిలిచింది. ఇది వివిధ రంగాల్లో ధరల ఒత్తిడి పెరుగుతున్న సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే, దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 18 ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 4 శాతానికి మించి నమోదైంది. ఈ జాబితాలో తెలంగాణ 6.36 శాతం ద్రవ్యోల్బణంతో దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి రెండూ 5.39 శాతం ద్రవ్యోల్బణంతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. అలాగే తమిళనాడు (5.24%), ఒడిశా (5.15%), మధ్యప్రదేశ్ (5.09%), అండమాన్-నికోబార్ దీవులు (5.08%) కూడా 5 శాతానికి పైగా ద్రవ్యోల్బణాన్ని నమోదు చేశాయి.
పెద్ద రాష్ట్రాల్లో కర్ణాటక (4.80%), రాజస్థాన్ (4.70%), ఉత్తరప్రదేశ్ (4.56%), కేరళ (4.34%), జార్ఖండ్ (4.29%), ఉత్తరాఖండ్ (4.13%), గుజరాత్ (4.01%) రాష్ట్రాలు కూడా RBI లక్ష్యమైన 4 శాతం స్థాయిని మించాయి.
మరోవైపు అత్యల్ప ద్రవ్యోల్బణం నమోదైన రాష్ట్రంగా మిజోరం (1.63%) నిలిచింది. ఆ తర్వాత త్రిపుర (1.65%), అరుణాచల్ ప్రదేశ్ (2.47%), మేఘాలయ (2.64%), నాగాలాండ్ (2.83%), మణిపూర్ (2.94%), ఢిల్లీ (2.96%) ఉన్నాయి.
దేశవ్యాప్తంగా ఆహార ద్రవ్యోల్బణం కూడా పెరిగింది. మేలో 4.78 శాతంగా ఉన్న ఫుడ్ ఇన్ఫ్లేషన్ జూన్లో 5.32 శాతానికి చేరుకుంది. మొత్తం రిటైల్ ద్రవ్యోల్బణాన్ని పెంచడంలో ఆహార ధరలే ప్రధాన పాత్ర పోషించాయి.
వివిధ ఖర్చుల విభాగాల్లో నగల ధరలు ఏడాదితో పోలిస్తే 50.2 శాతం పెరిగాయి. వస్తువుల రవాణా సేవల ఖర్చు 7.7 శాతం, వ్యక్తిగత వాహనాల నిర్వహణ వ్యయం 7.4 శాతం, హోటళ్లలో ఆహారం-పానీయాల సేవలు, పాన్-పొగాకు విభాగాల్లో 6.9 శాతం చొప్పున ద్రవ్యోల్బణం నమోదైంది. ఆహార పదార్థాల విభాగంలో 5.3 శాతం, గాజు వస్తువులు, టేబుల్వేర్, గృహోపకరణాల విభాగంలో 4.7 శాతం ధరల పెరుగుదల కనిపించింది.
అయితే కొన్ని విభాగాల్లో ధరలు తగ్గుముఖం పట్టాయి. వాహనాల కొనుగోలు విభాగంలో -4.6 శాతం డిఫ్లేషన్ నమోదైంది. ఇల్లు, తోటలకు ఉపయోగించే పరికరాలు -0.9 శాతం, వినోద పరికరాలు -0.7 శాతం తగ్గాయి. పానీయాల విభాగంలో 0.2 శాతం, సమాచార, కమ్యూనికేషన్ సేవల్లో 0.3 శాతం మాత్రమే స్వల్ప ధరల పెరుగుదల నమోదైంది.
వ్యక్తిగత వస్తువుల ధరలను పరిశీలిస్తే, అల్లం ధరలు అత్యధికంగా పెరిగాయి. జూన్లో అల్లం ద్రవ్యోల్బణం 50.41 శాతం నమోదుకాగా, మేలో ఇది 32.5 శాతం మాత్రమే ఉంది. టమాటా ధరలు 31.92 శాతం, కిస్మిస్ (ఎండు ద్రాక్ష) ధరలు 20.52 శాతం పెరిగాయి.
విలువైన లోహాల ధరలు కూడా భారీగా పెరిగాయి. వెండి ఆభరణాల ధరలు ఏడాదితో పోలిస్తే 133.21 శాతం పెరగగా, బంగారం, వజ్రాలు, ప్లాటినం ఆభరణాల ధరలు 36.82 శాతం మేర పెరిగాయి. ఈ పెరుగుదలలు దేశవ్యాప్తంగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని మరింత ఎగువకు నెట్టిన ప్రధాన కారణాలుగా ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
