Last Updated:
పసిడిని మించిన మక్కలు.. మద్దతు ధరను దాటేసి రైతుల ఇళ్లలో కాసుల వర్షం!
తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్న సాగు చేసిన రైతులకు తగిన ఫలితం దక్కుతుంది. మొక్కజొన్న ధరలు పెరగడంతో అన్నదాతల కళ్లల్లో ఆనందం వ్యక్తం అవుతుంది.కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీసం మద్దతు ధర కంటే అదనంగా వ్యాపారులు, రైతుల వద్ద నుంచి మొక్కజొన్నలను కొనుగోలు చేస్తున్నారు. ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ గా ప్రసిద్ధిగాంచిన వరంగల్ నగరంలోని ఎనమామల వ్యవసాయ మార్కెట్ లో మొక్కజొన్నకు రికార్డు స్థాయిలో ధర పలికింది. ఎంఎస్పి ద్వారా క్వింటాకు రూ.2,400 కేటాయించగా అదనంగా రూ.345 పలుకుతు రూ.2,745కు చేరింది. బయట స్టాక్ లేకపోవడం, పారిశ్రామిక వినియోగం పెరగడమే ఇందుకు కారణమని మార్కెట్ లోని మక్కల వ్యాపారి అశోక్ తెలిపారు. గత 25 సంవత్సరాలుగా మక్కల వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు.
క్వింటా మక్కకు సెప్టెంబర్ 18న రూ.2,745 ధర పలకగా,సెప్టెంబర్ 17న రూ.2,775 ధర పలికినట్లు చెప్పారు.గతేడాది ఈ మాసంలో రూ.2,500 వరకు ధర పలికింది.ఈ సీజన్లో అత్యధికంగా ధర పలకడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు.సెప్టెంబర్ 18న కనిష్ట ధర రూ.2600 పైచిలుకు ఉండగా గరిష్టంగా రూ.2,745 పలికిందని అన్నారు.
దేశంలోని ప్రధాన రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ వర్షాల జాప్యం వల్ల ఖరీఫ్ సీజన్ సాగు తగ్గింది.దీనికి తోడు మార్కెట్లో పాత నిల్వలు తక్కువగా ఉండడంతో ఈ ధరలు పెరగడానికి కారణమైందని తెలిపారు. దాంతో పాటు కోళ్ల మీద పశుగ్రాస తయారీ పరిశ్రమలో మొక్కజొన్న ప్రధానమైన వనరుగా ఉందన్నారు. ఈ రంగాల్లో డిమాండ్స్ స్థిరంగా పెరుగుతుండడంతో మార్కెట్ లో కొనుగోలుదారులు పోటీపడి కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా పెట్రోల్ లో ఇథనల్ బ్లెండింగ్ ను 20 శాతానికి పెంచాలనే లక్ష్యం కారణంగా ఇథనల్ తయారీ రంగం నుంచి మొక్కజొన్నకు డిమాండ్ ఏర్పడిందని వెల్లడించారు. గతంలో ఎక్కువగా స్టార్చ్ పౌల్ట్రీ రంగానికే పరిమితమైన మొక్కజొన్న ఇప్పుడు ఇథనల్ పరిశ్రమలో వాడుతుండడమే ఇందుకు కారణమని వివరించారు.
వ్యాపారులు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన వారు మొక్కజొన్నలను కోళ్ల దాన తయారీ పరిశ్రమలకు, పశుసంవర్తక దాన తయారీదారులకు, పెద్ద హోల్ సెల్ మార్కెట్లకు, మొక్కజొన్న ఆధారిత ఆహార పరిశ్రమలకు అమ్ముకుంటారు. మార్కెట్ లో మొక్కజొన్న ధరలను నిర్ణయించడంలో గింజల నాణ్యత అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. నిబంధనల ప్రకారం మొక్కజొన్న గింజల్లో తేమశాతం 14 శాతం లేదా అంతకంటే తక్కువ ఉండాలి.ఇదే ధర కొనసాగడంతో పాటు రానున్న రోజుల్లో ధర కాస్త పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం ఇంధనాల్లో ఇథనల్ మిశ్రమాన్ని పెంచే ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తుండడంతో ఇథనల్ తయారీ యూనిట్లలో సైతం మొక్కజొన్న వాడకం పెరిగింది అంటున్నారు. రానున్న రోజుల్లో మొక్కల రేటు మరింత పెరిగే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. మొక్కజొన్నకు ధరలు పెరగడంతో అన్నదాతల కళ్ళల్లో ఆనందం వ్యక్తం అవుతుంది.తాను రెండెకరాల్లో ఈ మొక్కజొన్న పంట వేశానని వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బంధన్ పల్లి గ్రామానికి చెందిన కౌడగాని కిషన్ అనే రైతు తెలిపారు. తాను రెండు ఎకరాల మొక్కజొన్నకు 60 వేల వరకు పెట్టుబడి పెట్టగా 60 క్వింటాళ్ల మొక్కజొన్నను దిగుబడి వచ్చింది.ఈ మొక్కజొన్నను మార్కెట్ కు తీసుకురాగా క్వింటాకు రూ.2,745 ధరకు విక్రయించినట్లు చెప్పారు. గతేడాది మొక్కజొన్నను రూ.2000 పైచిలుకకు విక్రయిస్తే ఈసారి అదనంగా ధర లభించిందన్నారు. ఈ ఏడాది అత్యధిక ధర లభించడం చాలా ఆనందంగా ఉందన్నారు.
