Last Updated:
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రోజురోజుకూ ఎంతో రసవత్తరంగా మారుతోంది. తాజా ఎపిసోడ్ లో ముకేశ్, దేబ్జానీ మధ్య నడిచిన ఎపిసోడ్ హైలైట్ అయింది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రోజురోజుకూ ఎంతో రసవత్తరంగా మారుతోంది. ఒకపక్క గొడవలు, మరోపక్క ఎమోషన్స్, ఇంకోపక్క లవ్ ట్రాక్లతో హౌస్ దద్దరిల్లుతోంది. హౌస్లో కంటెస్టెంట్ల మధ్య సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఈ సీజన్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న జంట ముకేష్ గౌడ, దేబ్జానీ. వీరిద్దరి మధ్య నడుస్తున్న క్యూట్ లవ్ ట్రాక్, అప్పుడప్పుడూ జరిగే అలకలు ఎపిసోడ్కే హైలైట్గా నిలుస్తున్నాయి. గత వీకెండ్ ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున ముందే ముకేష్పై తనకున్న ఇష్టాన్ని దేబ్జానీ బహిరంగంగా వ్యక్తపరిచిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ఎపిసోడ్లో ముకేష్పై ఆమె పడిన క్యూట్ జెలసీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.
నేటి ఎపిసోడ్లో స్విమ్మింగ్ పూల్ వద్ద జరిగిన ఒక సంఘటన ఆసక్తికరంగా మారింది. వర్షిణి, ముకేష్లు స్విమ్మింగ్ పూల్లో సరదాగా గడిపి వాష్ రూమ్ వద్దకు వచ్చారు. అక్కడ ఉన్న దేబ్జానీని చూసిన ముకేష్.. పొరపాటున ‘దేబ్జానీ’ అని పిలవబోయి ‘వర్షిణి’ అని అన్నాడు. దీంతో దేబ్జానీకి కోపం కట్టలు తెంచుకుంది. ‘హలో.. దేబ్జానీ నీకు వర్షిణిలా కనిపిస్తుందా? నువ్వు నా దగ్గరకు రాకు’ అని సరదాగా ఫైర్ అయింది. దానికి ముకేష్ సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. ‘నేను నాగ్ సార్ ముందే నీకు నా ఇష్టాన్ని చెప్పాను కదా’ అని దేబ్జానీ గుర్తుచేసింది. అయినా పరాయి అమ్మాయితో బట్టల్లేకుండా పూల్లో ఎలా ఉంటావ్ అంటూ ముకేష్ను నిలదీసింది. అక్కడ అబ్బాయిలు కూడా ఉన్నారని ముకేష్ కవర్ చేసే ప్రయత్నం చేసినా ఆమె వినలేదు.
ఈ క్యూట్ ఫైట్లో కమెడియన్ రామ్ ప్రసాద్ ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో సెటైర్ వేశాడు. ‘మా చెల్లి అన్యాయం చేస్తుందని తెలుసు కానీ, వీడు మా చెల్లికే అన్యాయం చేస్తున్నాడు’ అంటూ నవ్వులు పూయించాడు. ఆ తర్వాత వర్షిణి అక్కడికి రాగా, దేబ్జానీ మరింత రెచ్చిపోయింది. ‘నేను త్రిగుణ్కు కేవలం కాఫీ మాత్రమే ఇచ్చాను, నువ్వు మాత్రం పూల్లోకి దిగావ్. కొత్త వాళ్లు హౌస్లోకి వచ్చాక నేను కూడా వేరే వాళ్లతో పూల్లో ఉంటా.. అప్పుడు నీకు నా ఏంటో తెలుస్తుంది’ అంటూ దేబ్జానీ ముద్దుగా బెదిరించడం ఎపిసోడ్లో హైలైట్గా నిలిచింది.
ఇదిలా ఉంటే, హౌస్లో మొదటి కెప్టెన్ను ఎన్నుకునే ప్రక్రియ వాడివేడిగా సాగుతోంది. ఆడియెన్స్ ఓటింగ్ ద్వారా త్రిగుణ్, రోహిత్, షాలిని, అమన్, దేబ్జానీ, ముకేష్ గౌడ, ఝాన్సీ, రామ్ ప్రసాద్లు కెప్టెన్సీ కంటెండర్లుగా ఎంపికయ్యారు. గజిబిజిగా ఉన్న అక్షరాలతో పదాలను వెతికి పట్టుకునే టాస్క్ను బిగ్ బాస్ వీరికి ఇచ్చాడు. ఈ టాస్క్లో కంటెస్టెంట్ల మధ్య తీవ్ర స్థాయి వాగ్వాదాలు జరిగాయి. ఎవరు అనర్హులు అనే దానిపై ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఫైనల్గా ఈ రేసు నుంచి త్రిగుణ్, రామ్ ప్రసాద్, దేబ్జానీ, రోహిత్లు ఎలిమినేట్ కాగా.. మిగిలిన వారి మధ్య మొదటి కెప్టెన్సీ కోసం హోరాహోరీ పోరు కొనసాగుతోంది.

