Last Updated:
తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పోటీలో ఉన్న ‘మన ప్యానెల్’ సభ్యులు నేడు కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా తనను ఏకగ్రీవంగా ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు సి.కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పోటీలో ఉన్న ‘మన ప్యానెల్’ సభ్యులు నేడు కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా తనను ఏకగ్రీవంగా ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు సి.కళ్యాణ్ కృతజ్ఞతలు తెలుపుతూ, తనకు మద్దతుగా నామినేషన్ ఉపసంహరించుకున్న బండ్ల గణేష్కు ధన్యవాదాలు చెప్పారు. తాము దాసరి నారాయణరావు గారి అడుగుజాడల్లో నడుస్తున్నామని, బాలకృష్ణ గారితో కూడా సానుకూలంగా మాట్లాడామని తెలిపారు. అయితే, ప్రొడ్యూసర్స్ గిల్డ్పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. తాము గిల్డ్కు పూర్తి సహకారం అందిస్తే, వారు మాత్రం కౌన్సిల్కు వెన్నుపోటు పొడుస్తున్నారని, ఎన్నికల సమయంలోనే వారు తెరపైకి వస్తారని మండిపడ్డారు. కౌన్సిల్కు రావాల్సిన కమిషన్ సొమ్మును వారు తీసుకుంటున్నారని, కనీసం కొత్తవారికి మెంబర్షిప్ కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. నిర్మాతల కోసం మెడిక్లైమ్ తీసుకొచ్చింది తామేనని, తాము ఎన్నికైన వెంటనే దాన్ని రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచి వెంటనే కార్డులు అందిస్తామని సి.కళ్యాణ్ ప్రకటించారు. కేవలం ఒక్క సినిమా చేసిన చిన్న నిర్మాతకు కూడా మెడిక్లైమ్ వర్తించేలా చేస్తామన్నారు. గతంలో మాదిరిగానే పిల్లల చదువుకు రూ.30 వేలు, కుటుంబంలో ఒక ఆడబిడ్డ పెళ్లికి రూ.30 వేలు లేదా అంతకంటే ఎక్కువ ఆర్థిక సాయం అందిస్తామన్నారు. వృద్ధులకు పెన్షన్ కమిటీ వేసి ఆదుకోవడంతో పాటు మరణించిన వారి కుటుంబాలకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ భరత్ భూషణ్ అద్భుతంగా పనిచేస్తున్నారని, ఆయనతో కలిసి రెండు రాష్ట్రాల సినీ ఆస్తుల గురించి చర్చిస్తున్నామని, ఈ విషయమై త్వరలోనే ఇద్దరు ముఖ్యమంత్రులను కలుస్తామని తెలిపారు. భవిష్యత్తులో వెబ్సైట్ ద్వారా చిన్న సినిమాలకు ఓటీటీ బిజినెస్ జరిగేలా చూస్తామని, అలాగే కౌన్సిల్ భవన అద్దెల ద్వారా వచ్చే ఆదాయంలో 30 శాతాన్ని 2032 నుంచి సినిమా వారి కోసమే ఉపయోగిస్తామని ఆయన వివరించారు.

