Last Updated:
Diesel Exports: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దేశీయంగా ఇంధన లభ్యతను పెంచడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకునేందుకు వీలుగా డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్ – విమాన ఇంధనం) ఎగుమతులపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని (విండ్ఫాల్ ట్యాక్స్) భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది.
తాజా సవరణల ప్రకారం, డీజిల్ ఎగుమతులపై కేంద్రం ఏకంగా లీటరుకు రూ. 7 చొప్పున పన్నును పెంచింది. దీనితో ఇప్పటివరకు లీటర్పై రూ. 8.5 గా ఉన్న ఎగుమతి పన్ను ఒక్కసారిగా రూ. 15.5 కి చేరింది. డీజిల్, విమాన ఇంధన ఎగుమతులపై పన్నులు పెంచినప్పటికీ, పెట్రోల్ ఎగుమతిదారులకు మాత్రం కేంద్రం కొంత ఉపశమనం కలిగించింది. పెట్రోల్ ఎగుమతులపై ఉన్న ట్యాక్స్ను లీటరుకు రూ. 4 నుండి రూ. 2.5 కి తగ్గించింది. ఈ సవరించిన నూతన రేట్లు తక్షణమే (నేటి నుంచే) అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మరోవైపు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశీయ ఇంధన మార్కెట్పై ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల పెరుగుదల, దానికి తోడు ఎగుమతి సుంకాల సవరణల నేపథ్యంలో దేశీయ మార్కెట్లోనూ పెట్రోల్, డీజిల్ లీటర్ ధరలు పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రానున్న రోజుల్లో చమురు సంస్థలు దేశీయ రిటైల్ ధరలను సవరిస్తాయా లేదా అనేది చూడాల్సి ఉంది.
Hyderabad,Telangana
Jul 16, 2026 10:29 AM IST

