Last Updated:
జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రయాన్-3 విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ రోజున ఇస్రో శాస్త్రవేత్తల కృషిని వారు ప్రత్యేకంగా కొనియాడారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) సాధించిన చారిత్రక విజయానికి గుర్తుగా ఆగస్టు 23న జరుపుకునే జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 2023 ఆగస్టు 23న మన చంద్రయాన్-3 మిషన్ జాబిల్లి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా అడుగుపెట్టి ప్రపంచ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ అద్భుతమైన ఘనతను స్మరించుకుంటూ, అంతరిక్ష రంగంలో భారత్ సాధిస్తున్న అద్భుత ప్రగతిని ప్రధాని మోదీ కొనియాడారు. “అందరికీ జాతీయ అంతరిక్ష దినోత్సవ శుభాకాంక్షలు! మనం ఇకపై మరింత ఉన్నతంగా కలలు కందాం.. సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగుదాం.. అంతరిక్ష పరిశోధనల్లో నూతన సరిహద్దులను దాటుకుంటూ వెళ్దాం” అని ప్రధాని సోషల్ మీడియా వేదికగా స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చారు.

