ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) వివేక్ యాదవ్ చేసిన ప్రతిపాదన ఆధారంగా ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. 2026 జులై 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి అర్హుడికి ఈ ప్రత్యేక సవరణలో పేరు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.
తాజాగా ఏపీ రాష్ట్ర ఎన్నికల అధికారి తెలిపిన షెడ్యూల్ ప్రకారం బూత్ లెవెల్ అధికారులు (BLOలు) ఇంటింటి సర్వే, వివరాల సేకరణ కార్యక్రమం జూన్ 15 నుంచి జులై 24, 2026 వరకు కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ కూడా జులై 24లోపు పూర్తి చేయనున్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా జులై 31న విడుదల చేయబడుతుంది.
అనంతరం జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. వాటి పరిశీలన, నోటీసుల జారీ, పరిష్కార ప్రక్రియ జులై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు కొనసాగుతుంది. అన్ని సవరణల అనంతరం తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 3, 2026న అధికారికంగా ప్రచురించనున్నారు.

రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తికాకపోవడం, కొన్ని చోట్ల ఓటర్లు ఫారాలు నింపి సిద్ధంగా ఉంచినా బీఎల్ఓలు వాటిని సేకరించడంలో జాప్యం జరగడం, సేకరించిన వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియ కూడా పూర్తికాకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. ఈ పరిస్థితుల్లో అర్హులైన ఓటర్లు ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాయి. దీంతో ఓటర్ల నమోదు, సవరణలు సజావుగా జరిగేలా మరో 10 రోజుల అదనపు గడువును కల్పించారు.
సవరించిన షెడ్యూల్ను ప్రజలకు అన్ని రకాల మీడియా ద్వారా విస్తృతంగా తెలియజేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అలాగే రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు మార్పులను అధికారికంగా లిఖితపూర్వకంగా తెలియజేయనుంది. ఈ ఉత్తర్వులను కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సందీప్ కుమార్ జారీ చేయగా, వాటి ప్రతులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అమరావతిలోని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి పంపించారు.
ఫారంలో పేరు, ఓటర్ ఐడీ సంఖ్య, చిరునామా, పోలింగ్ కేంద్రం, నియోజకవర్గం వివరాలు నమోదు చేయాలి. 2002 ఓటర్ల జాబితాలో పేరు ఉంటే ఆ వివరాలను పేర్కొనాలి. పేరు లేకపోతే తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయవచ్చు. అలాగే జనన తేదీ, ఆధార్ సంఖ్య, మొబైల్ నంబర్, తల్లిదండ్రుల ఓటర్ ఐడీ వివరాలు, ఫొటో జత చేసి బీఎల్ఓకు సమర్పించాలి. రెండు కాపీల్లో ఒకదానిపై బీఎల్ఓ సంతకం చేసి తిరిగి ఇస్తారు. ఆ కాపీని భవిష్యత్తు అవసరాల కోసం భద్రంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
అదే https://voters.eci.gov.in/ పోర్టల్లో గతంలో తల్లిదండ్రులు నివసించిన జిల్లా, నియోజకవర్గం, ఇంటిపేరుతో శోధిస్తే వారి ఓటరు వివరాలను గుర్తించవచ్చు. అవసరమైతే బీఎల్ఓల సహాయంతో కూడా ఈ వివరాలను పొందే అవకాశం ఉంది.
ఓటరు ఇంటి వద్ద అందుబాటులో లేకపోతే కుటుంబ సభ్యులు, బంధువులు లేదా స్నేహితులు ఆయన తరపున ఎన్యూమరేషన్ ఫారాన్ని నింపి బీఎల్ఓకు అందించవచ్చు. అవసరమైతే వారి తరపున సంతకం కూడా చేయవచ్చు. అలాగే ఎన్నికల సంఘం వెబ్సైట్లో అందుబాటులో ఉన్న బీఎల్ఓ సంప్రదింపు వివరాల ద్వారా సహాయం పొందే అవకాశం ఉంది. అధికారులు స్పష్టం చేసినట్లుగా, ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి చేయకపోతే ఓటరు హక్కు కోల్పోయే అవకాశం ఉన్నందున ప్రతి అర్హుడు జులై 24లోపు తప్పనిసరిగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.
