కారు కొనాలని చూస్తున్న వారికి టాటా మోటార్స్ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. కంపెనీకి చెందిన ప్యాసింజర్ వాహనాల ధరలు సెప్టెంబర్ 1 నుంచి పెరగనున్నాయి. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు, ద్రవ్యోల్బణం ప్రభావాన్ని కొంతవరకు భర్తీ చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ (టీఎంపీవీ) శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించింది. కంపెనీ విక్రయించే వివిధ మోడళ్లపై గరిష్ఠంగా రూ.25,000 వరకు ధర పెరగనుంది. ఈ ధరల పెంపు కంపెనీ పోర్ట్ఫోలియోలోని అన్ని రకాల వాహనాలకు వర్తిస్తుంది. ఇందులో సాధారణ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఉన్నాయి. అయితే ఏ మోడల్, ఏ వేరియంట్ అనేదాన్ని బట్టి ధర పెంపు మారుతుందని టీఎంపీవీ ఒక ప్రకటనలో తెలిపింది. “పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు, కొనసాగుతున్న ద్రవ్యోల్బణం ప్రభావాన్ని కొంతవరకు భర్తీ చేసుకోవడానికే ఈ ధరల సవరణ చేస్తున్నాం” అని కంపెనీ తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)

