జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో 8వ వేతన సంఘం 2025 నవంబర్ 3న ఏర్పాటు అయింది. కేంద్ర ప్రభుత్వం కమిషన్కు మొత్తం 18 నెలల కాలాన్ని కేటాయించింది. ఈ గడువులో కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉద్యోగ సంఘాలు, ఇతర భాగస్వాములతో సంప్రదింపులు జరిపి వారి అభిప్రాయాలను సేకరించనుంది. అనంతరం జీతాలు, భత్యాలు, పెన్షన్లు, ఉద్యోగ సంబంధిత ఇతర అంశాలపై సిఫార్సులతో కూడిన తుది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. కమిషన్ తన కార్యకలాపాల్లో భాగంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉద్యోగ సంఘాలు, పెన్షన్ సంస్థలు, ఇతర భాగస్వాములతో సమావేశాలు నిర్వహించింది. గత కొన్ని నెలల్లో ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, లడఖ్, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల్లో పర్యటించి ఉద్యోగులు, సంఘాల నుంచి వారి సమస్యలు, అభ్యంతరాలు, సూచనలను తెలుసుకుంది. ముఖ్యంగా వేతనాలు, చెల్లింపులు, భత్యాలు, ఉద్యోగ సంబంధిత సంస్కరణలు, పెన్షన్ అంశాలపై వచ్చిన అభిప్రాయాలను కమిషన్ పరిగణనలోకి తీసుకుంటోంది.
